Harish Rao | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకనే, కేసీఆర్ సీఎం అయ్యాకనే రైతు విలువ, గౌరవం పెరిగిందని, భూమి విలువ పెరిగిందని మంత్రి హరీశ్రావు అన్నారు. తల్లి చేతిలో బిడ్డ ఏ విధంగా సురక్షితమో, కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటేనే సురక్షితంగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ వస్తే ముఠాలు ఉంటాయన్నారు.
బుధవారం ఒక న్యూస్ చానల్తో హరీశ్ మాట్లాడుతూ తాను నిబద్ధత గల బీఆర్ఎస్ నాయకుడినని, పదవులు కోరుకోనని, క్యారెక్టర్ను కోరుకుంటానని స్పష్టం చేశారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తానని చెప్పారు. కాంగ్రెస్కు రాష్ట్ర పథకాలపై కనీస అవగాహన లేదని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే మోకాలు ఆపరేషన్ చేస్తున్నామని, కానీ కాంగ్రెస్ మోకా లి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పడం వారికి గ్రౌండ్ రియాల్టీ తెలియనడానికి నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఆఫీసు లీడర్లు తప్ప ఫీల్డ్ లీడ ర్లు కాదని ఏద్దేవా చేశారు. తెలంగాణలో ఎక్కడా కూడా భూస్వాములు లేరని, మూడు ఎకరాల స్థలం ఉన్న వారు 93 శాతం ఉన్నారని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే స్థాయికి వ్యవస్థలను ప్రభు త్వం సిద్ధం చేసిందని తెలిపారు. మూడోసారి అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ప్రశ్నపత్రం లీక్ చేసిన వారు జైల్లో ఉన్నారనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అయితే గవర్నర్ తాము పంపిన బి ల్లును ఎందుకు తిప్పి పంపుతారని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. ఎన్నికల సంఘం అనుమతించడంలేదని చెప్పారు.