Minister Harish Rao | కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. గొంగిడి సునీత ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతుందన్నారు. 80సీట్లతో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాబోతుందన్నారు. కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రజల కష్టాలు పోయాయన్నారు. బొమ్మలరామారానికి గోదావరి జలాలు తెస్తానని 2018 ఎన్నికలలో హామీ ఇచ్చి నెరవేర్చామన్నారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలంటున్నడని.. రేవంత్ రెడ్డి తుపాకీ రాముడు అంటూ విమర్శించారు.
రైతులకు ఐదు నుంచి ఏడు గంటల కరెంటు చాలని డీకే శివకుమార్ అంటున్నాడని.. మూడు గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని.. 24 గంటలు కావాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలంటూ హామీలిచ్చి అధికారంలోకి రాగానే మాట తప్పారన్నారు. కాంగ్రెస్కు ఛాన్స్ ఇస్తే ఆరు గ్యారంటీలకు బదులు ఆరుగురు సీఎంలు మారుతారన్నారు. గొంగిడి సునీతను గెలిపిస్తే రూ.5వేల పింఛన్ ఇస్తామన్నారు. రైతుబంధు దుబారా, రైతులు బిచ్చగాళ్లంటున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే ఆగమవుతుందన్నారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ఈ సీని కలిశారన్నారు. కానీ, రైతుబంధు అమలు చేయొచ్చని ఈసీ అనుమతి ఇచ్చిందన్నారు.
ఇయ్యాల, రేపు, ఎల్లుండి సెలవులు కాబట్టి మంగళవారం రైతుల అకౌంట్లలో రైతుబంధు పైసలు పడబోతున్నాయన్నారు. రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వగానే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయన్నారు. కాంగ్రెస్ విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సోనామసూరి సన్నబియ్యం ఇస్తామన్నారు. ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్ కు అవకాశమిస్తే ఆగం కావడం ఖాయమన్నారు. పుట్టిన తెలంగాణ పెంచిన కేసీఆర్ చేతిలో ఉంటేనే సురక్షితమని.. రిస్క్ వద్దు కారు ముద్దు అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తు విద్యార్థులదేనని.. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తెచ్చి ఆలేరు యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
మూడుచింతలపల్లి రోడ్డును నెలలో డబుల్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి ప్రతి ఇంట్లో చర్చ పెట్టాలన్నారు. కార్యకర్తలకు కష్టమొస్తే కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఆలేరు నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని ఇచ్చామని.. ఎన్నో మంచి పనులు కేసీఆర్ను సాదుకుందామా చంపుకుందామో ప్రజలే తేల్చుకోవాలన్నారు. రుణమాఫీని పూర్తి చేస్తామని, కరోనాతో ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ను నమ్మితే ఉన్న గోషి పోతుందన్నారు. సునీతను 50వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు.