పాల్వంచ: రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏండ్ల తరబడి అడవినే నమ్ముకున్న ఆదివాసీ, గిరిజన బిడ్డలను ప్రభుత్వం ‘పట్టా’భిషిక్తులను చేస్తున్నది. ఏళ్లకేళ్లుగా వారు గోసపడిన చోటే.. వారికి అపూర్వ గౌరవాన్ని అందిస్తున్నది. వారు సాగు చేసుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నది. ఖమ్మం (Khammam) జిల్లా పాల్వంచలోని (Palwancha) సుగుణ ఫంక్షన్ హాల్లో మంత్రి పువ్వాడ అజయ్తో (Minister Puvvada Ajay) కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పోడు పట్టాలను (Podu Lands) గిరిజన రైతులకు పంపిణీ చేశారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన రైతులకు పోడు పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియా నాయక్, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో 13,139 ఎకరాలు సాగుచేసుకుంటున్న 6,589 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. సమైక్య పాలనలో పోడు పట్టాలు లేక అరిగోస పడిన ఆదివాసీలు పట్టాలు అందుకోవడంతో సంతోషం వ్యక్తంచేశారు. భయంభయంగా గడిపిన చోటే ఇప్పటి నుంచి దర్జాగా బతుకుతామంటూ సంబురపడుతున్నారు. తమకు బతుకుదెరువు కల్పించిన సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ చేతులు జోడిస్తున్నారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలోనూ ఖమ్మం జిల్లా గిరిజన రైతులకు పోడు భూముల హక్కు పత్రాలు అందజేస్తారు.
బుక్కెడు బువ్వ కోసం పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టించారు నాటి సమైక్య పాలకులు. కాళ్లతోనూ తన్నించారు. చేతికొచ్చిన పంట ఇంటికి రాకుండా కందకాలు తవ్వారు. అడవిని నరికారంటూ కేసులు పెట్టారు. ఇంకా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు. కానీ, తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. అధ్యయనానికి సబ్ కమిటీ వేశారు. మూడంచెల సర్వే నిర్వహించారు. వాస్తవ స్థితిగతుల ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించారు. జీవో 140 ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సమైక్య పాలనలో 2008 నుంచి 2012 వరకు అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 24 వేల మందికి మాత్రమే పట్టాలు మాత్రమే ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 57,184 మందికి పట్టాలు అందించనుండడమే గాక రైతుబంధు, రైతుబీమా పథకాలనూ అమలు చేయనుంది.