సిద్దిపేట : యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. తలవంచి చదివితే తలెత్తుకొనే రోజులు వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్లోగ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నిరుద్యోగులు అవకాశాలను అందిపుచ్చుకుని ఓటమితో ఆగిపోకుండా ముందుకు సాగుతూనే విజయం సాధ్యమవుతుందన్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ క్లోజ్ అని బోర్డ్ కనిపిస్తుంది. ప్రైవేట్ పాఠశాలలను తలదన్నేలా అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్నాం.
ఇది తెలంగాణ ప్రభుత్వం పని తిరుకు నిదర్శనమన్నారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్లో చదువుకొని 318 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధపడుతున్న వాళ్లందరూ కూడా ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు పెంచి 91,000 ఉద్యోగాలు తెలంగాణ యువతకు పొందే లా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.
గ్లోబలైజేషన్ లో ప్రపంచం చిన్నగా మారిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఆసక్తి ఉన్న వారికి కోచింగ్ ఇప్పిస్తాను. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు కోసం ఉచితంగా ఓవర్సీస్ శిక్షణ ఇప్పించి వీసా ప్రాసెస్ చేసి చదువుకోడానికి విదేశాలకు పంపిస్తానని మంత్రి హామీనిచ్చారు.
కష్టపడే విద్యార్థులకు తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసేలా ఒత్తిడి తెస్తున్నామని మంత్రి చెప్పారు. సిద్దిపేట విద్యాక్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. త్వరలోనే బీసీ స్టడీ సర్కిల్ శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసుకుందామని హరీశ్ రావు పేర్కొన్నారు. బాగా చదివి ఉద్యోగాలు సాధించాలని ఆయన సూచించారు.