మహబూబ్నగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మనమంతా సీఎం కేసీఆర్తో ఉంటే జలదృశ్యం వస్తదని, ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్యా సదృశ్యమేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మనకు జలదృశ్యం కావాల్నా? ఆత్మహత్యా సదృశం కావాల్నా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలె అని అన్నారు. ‘కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్.. కానే కాదన్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కోర్టుల్లో కేసులు వేసినా.. గ్రీన్ ట్రిబ్యునల్లో అడ్డంకులు పెట్టినా.. భూసేకరణను ఆపినా.. పట్టువదలని విక్రమార్కుడిలాగా రాత్రింబవళ్లు కష్టపడి పాలమూరు ప్రాజెక్టును మనకు అందిస్తున్నరు’ అని చెప్పారు.
మంగళవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రూ. 20 కోట్లతో నిర్మించిన వంద పడకల దవాఖాన, 150 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్, ఇండోర్ స్టేడియాల పెండింగ్ పనులు, మున్సిపల్ కార్యాలయం, సీసీరోడ్లు, సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మున్సిపల్ అభివృద్ధి కరదీపికలను ఆవిష్కరించారు. అంతకుముందు అచ్చంపేట వై రోడ్ నుంచి నిర్వహించిన బైక్ ర్యాలీలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసేందుకు నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రేమతో అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. రూ.2,300 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేసినట్టు తెలిపారు. ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆంజనేయస్వామి ప్రాజెక్టు, నిరంజన్షావలీ లిఫ్ట్ ఇరిగేషన్లను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా ఇంత పెద్ద సభ నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లోనే నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయని తెలిపారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పట్టువదలని విక్రమార్కుడిలా ఇరిగేషన్ ప్రాజెక్టు సాధించారని చెప్పారు. ‘అచ్చంపేటకు సాగునీళ్లు ఎవరు తెచ్చిండ్రు అంటే కేసీఆర్ ఇచ్చిండు.. గువ్వల బాలరాజు తెచ్చిండు’ అని ఈ ప్రాంత రైతులు చెప్పుకుంటారని అన్నారు.
మే నెలలో మండుటెండలో ఏ అక్కా చెల్లెబిందె వట్టుకొని రోడ్డుపైకి రాకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ది కాదా? కేసీఆర్ లేకుంటే మిషన్ భగీరథ ఆలోచన ఎవరికైనా వస్తుండెనా? చంద్రబాబు, వైఎస్సార్ ఇలాంటి పథకం గురించి ఆలోచన చేసిన్రా? మిషన్ భగీరథను దేశం మెచ్చింది.. అన్ని రాష్ర్టాలు అనుసరిస్తున్నయ్.
– హరీశ్రావు
సీఎం కేసీఆర్తోనే ఎత్తిపోతలు సాధ్యం
బీఆర్ఎస్ సర్కారు ఉన్నది గనుక.. కేసీఆర్ ఉన్నడుగనుక ఈ ఎత్తిపోతలు సాధ్యమయ్యాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం అయితుందంటే.. కల్వకుర్తి పూర్తయ్యిందంటే.. ఎంజీకేఎల్ఐ ద్వారా అచ్చంపేట, ఉప్పునుంతలకు ప్యాకేజీ 30 ఎక్స్టెన్షన్ పథకం వచ్చిందంటే.. భీమా, నెట్టెంపాడు, కాళేశ్వరం పూర్తయిందంటే అది కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెప్పారు. గతంలో పదేండ్లు పాలించిన కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసిందా? ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.
పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ ఏమైనా ఇచ్చిందంటే కరువు, వలసలు మాత్రమేనని విమర్శించారు. పొట్ట చేతబట్టుకుని 10 లక్షల మంది వలసపోయేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ధ్వజమెత్తారు. ‘ఇయ్యాల కేసీఆర్ వచ్చినంక వలసలు వాపస్ వచ్చినయ్..పాలమూరు పచ్చబడ్డది.. ఇయ్యాల ఇరిగేషన్ ఫెసిలిటీ అద్భుతంగా పెరిగింది. రేపో మాపో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభమైతది.. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలైతయ్’ అని చెప్పారు. వంద పడకల దవాఖాన సీఎం కేసీఆర్ లేకుంటే వచ్చేదా? అనేది అచ్చంపేట ప్రజలు ఆలోచించాలని అన్నారు. అన్ని సౌకర్యాలతో వైద్యశాల కట్టిచ్చామని, ఎమ్మెల్యే బాలరాజు, ఎంపీ రాములు పట్టుబడితే ఐసీయూ, డయాలిసిస్ సెంటర్ పెట్టినమని, డాక్టర్ పోస్టులను మం జూరు చేసి.. అన్ని సౌకర్యాలతో వంద పడకల దవాఖానను అచ్చంపేటలో ప్రారంభించామని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో బస్తా ఎరువు కోసం మన అచ్చంపేట పోలీస్స్టేషన్ దాకా లైన్ల నిలవడాలె. కాంగ్రెస్ పాలనలో లాఠీచార్జీలు జరిగాయి. కరెంట్కోసం కండ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూసే రోజులు కావాల్నా? ఏడు గంటల కరెంటు కావాల్నా? పొద్దుందాక మూడు గంటలు.. పొద్దుగూకి నాలుగు గంటలు..గంటగంటకూ ట్రిప్ అయ్యే కరెంటు.. కాలిపోయే మీటర్లు.. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కావాల్నా? 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాల్నా? దొంగరాత్రి కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాల్నా ? దయచేసి రైతన్నలు ఆలోచించాలె.
– హరీశ్రావు
బీఆర్ఎస్ హయాంలో సీన్ రివర్స్
‘కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్కార్ దవాఖానల్లో డాక్టర్లు ఉండకపోయేటోళ్లు.. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాడుకొనే రోజులు ఉండేవి’ అని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో వైద్యరంగాన్ని బలోపేతం చేసుకొన్నట్టు చెప్పారు. దవాఖానల్లో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ప్రసవాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 70 శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 30 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో అయితే..70 శాతం ప్రైవేట్లో అయ్యేవని గుర్తుచేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందన్నారు. ‘దవాఖానల్లో రెండు వేల డాక్టరు పోస్టులు భర్తీచేసినం. 4 వందల కోట్లతో ఎంసీహెచ్ దవాఖానలను ఆధునీకరించుకున్నం. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ను 13 వేల కోట్లకు పెంచుకున్నం. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నం’ అని వివరించారు. అచ్చంపేటకు నర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయాలని, ఎస్ఎల్బీసీలో భూసేకరణ డబ్బుల విడుదల చేయాలని, డబుల్బెడ్రూం ఇండ్ల కోటా ఇంకా పెంచాలని ఎమ్మెల్యే, ఎంపీ తనను కోరారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు.
కేసీఆర్ను మించిన నాయకుడు ఉన్నడా?
తెలంగాణలో కేసీఆర్ను మించిన నాయకుడు లేడని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘కాంగ్రెసోళ్లకు, బీజేపోళ్లకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటదా? గా ఢిల్లీలో కూసున్న రాహుల్గాంధీకి గీ అచ్చంపేట లిఫ్ట్ గూర్చి మనసున పడ్తదా? గా నరేంద్రమోదీకి మన పాలమూరు ఎత్తిపోతల గురించి పడ్తదా?’ అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలన్నా.. అచ్చంపేట ఎత్తిపోతల పథకం త్వరితగతిన జరగాలన్నా..అది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ‘కేసీఆర్ పథకాలు ప్రతి గుండెగుండెలో ఉన్నయ్.. ప్రతి గడపగడపకూ చేరుకున్నయ్. కేసీఆర్ పథకాలు అందని ఇల్లు ఉన్నదా? కాంగ్రెసోళ్లకు వచ్చినయా? రాలేదా?వాళ్లకు గూడ 24 గంటల కరెంట్, రైతుబంధు, కల్యాణలక్ష్మి వచ్చింది. కాకపోతే వాళ్లు పొద్దుగూకి వచ్చి చీకట్లో చెక్కులు తీసుకుపోతుండ్రు’ అని చమత్కరించారు. ‘మా కాంగ్రెస్ గవర్నమెంటోళ్లు మన ఆడపిల్ల పెండ్లి పెట్టుకుంటే రూపాయి ఇయ్యలేదే.. కానీ మీ గవర్నమెంట్ లక్ష ఇచ్చింది..’ అని ఆ పార్టీ నాయకులే అంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పాలన అంటే సర్కారు దవాఖానలో డాక్టర్లు ఉండరు.. మందులు ఉండయ్.. కాంగ్రెస్ పాలన అంటే కరెంటుండదు. కాంగ్రెస్ పాలన అంటే 2 వేల పింఛన్ బంజేసి మళ్లా 200 పింఛన్ తీసుకొస్తరు. కాంగ్రెస్ నాయకులది పదవుల యావ.. ప్రజల గురించి ఆలోచించరు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పార్టీ..ప్రజలగురించి ఆలోచించే నాయకుడు కేసీఆర్.
– హరీశ్రావు
ప్రతిపక్షాలకు భయం పట్టుకొన్నది..
బీఆర్ఎస్ అంటే బీజేపీకి భయం..కాంగ్రెస్కు కలవరం అని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ను నోటికొచ్చినట్టు తిడుతున్నారని మండిపడ్డారు.‘ఎందుకు తిడుతున్నరు కేసీఆర్ను..2 వేల పింఛన్ ఇచ్చినందుకా? న్యూట్రిషన్ కిట్ ఇచ్చినందుకా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకా? దవాఖానలు బాగుచేసినందుకా? జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టినందుకా? ఆడపిల్ల పెండ్లికి కల్యాణలక్ష్మికింద లక్ష ఇచ్చినందుకా? పేదవాళ్లకు పింఛన్ను పదింతలు చేసినందుకా? ఎందుకోసం కేసీఆర్ను తిడుతున్నరు? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎవ్వరు అడగకపోయినా ఎకరానికి పదివేల పెట్టుబడి ఇచ్చారని, 24 గంటల కరెంటు ఇచ్చారని, సకాలంలో ఎరువులు అందిస్తూ పండిన పంటను ఒక్క గింజలేకుండా కాంటాపెట్టి కొంటున్నారని అన్నారు. అలాంటి కేసీఆర్ను మనం కాపాడుకోవాలె అని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే పథంలో ముందుకుసాగాలె అని పిలుపునిచ్చారు.
ప్రాణం పెట్టి ప్రాజెక్టులను నిర్మిస్తా: గువ్వల
తనకు రాజకీయ జన్మనచ్చిన అచ్చంపేట రైతుల రుణం తీర్చుకునేందుకు తన ప్రాణాన్ని పణంగా పట్టైనా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి తీరుతానని ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. రూ. 2,300 కోట్లతో అచ్చంపేటకు ఉమామహేశ్వరం, నిరంజన్షావలీ, మద్దిమడుగు అంజన్న, చెన్నకేశవస్వామి రిజర్వాయర్లకు ఆమోద ముద్రవేసి వేసినందుకు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కాలువల వెంట తిరిగి భూములు కోల్పోతున్న రైతుల కాళ్లకు దండం పెట్టి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతానని స్పష్టం చేశారు.
ప్రజలు గర్వపడేలా సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కట్టారు. కాంగ్రెసోడు కూలగోడ్తా అంటడు.. బీజేపోడేమో పేల్చేస్తా అంటడు.. తెలంగాణకు కూల్చేటోడో పేల్చేటోడో కాదు.. ఇటుక ఇటుక పెట్టి ఈ తెలంగాణను నిర్మించేటోడు కావాలె. అది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వల్లే సాధ్యం. ప్రతిపక్షం చెప్పే అబద్ధాలను అభివృద్ధి అనే ఆయుధంతో తిప్పిగొట్టాలె. విపక్షాలు విషంజిమ్మే ప్రయత్నాన్ని విషయంతో తిప్పిగొట్టాలె.
– మంత్రి హరీశ్రావు
మా మధ్య అపోహాలు సృష్టించొద్దు: ఎంపీ రాములు
అచ్చంపేట నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాను ఇద్దరం కలిసి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నామని ఎంపీ రాములు అన్నారు. అచ్చంపేట ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ క్యాబినెట్లో ఆమోదముద్ర వేశారని, అచ్చంపేట ప్రజలు అదృష్టవంతులని చెప్పారు. దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, జెడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీసింగ్, శాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
హిమాచల్ప్రదేశ్ సీఎం తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ను గెలిపిస్తే మళ్లీ మా పాలన తెస్తా అంటుండు.. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటదో తెలువదా మనకు.రైతుబంధుకు, రైతుబీమాకు మా రైతుల్ని దూరంచేస్తారా? కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనైనా రైతుబంధు ఇస్తున్నదా? ఎకరానికి పదివేలు ఇచ్చే ఒకే ఒక్కడు కేసీఆర్. రైతుబంధు కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించుకోవాలె.
-మంత్రి హరీశ్రావు
ఆర్యవైశుల ఐక్యత అభినందనీయం: హరీశ్రావు
ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాలను చేయడంలోనూ ఐకమత్యంగా ఉండటం అభినందనీయమని హరీశ్రావు అన్నారు. శ్రీశైలంలో ఆర్యవైశ్య భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వారికోసమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చేపట్టిన గదుల నిర్మాణ దాతలకు శుభాకాంక్షలు చెప్పారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల వర్తక వ్యాపారులు చేస్తున్న కార్యక్రమాలకు శ్రీశైల దేవస్థానం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య భవన్లో యాత్రికుల కోసం నిర్మించిన గదులు, సౌకర్యాలను మంత్రి హరీశ్రావు పరిశీలించారు.
తెలంగాణలో బీజేపీ ఖేల్ ఖతం
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం కష్టమేనని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పేర్కొన్న విషయం తెలిసిందే. పార్టీలో చేరాలని పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపితే తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని వారే తనకు రివర్స్ కౌన్సెలింగ్ ఇచ్చారని చెప్పారు. దీనిపై అచ్చంపేట సభలో మంత్రి హరీశ్రావు స్పందించారు. ‘ఆరునెలలకు ఎలక్షన్లు ఉన్నయ్, కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు బయల్దేరిన్రు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఉంటడు.. ఒకాయన నిన్న మాట్లాడుతూ చేతులెత్తేశిండు.. మా పార్టీలో ఎవరూ చేరట్లేదు.. మా పనైపోయింది అన్నడు’ అని గుర్తుచేశారు. అంటే బీజేపీని తెలంగాణలో ఎవరూ నమ్ముతలేరని అర్థమైపోయిందని అన్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మనే చేతులెత్తేశాడని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పేదంతా వేదాంతం.. చేసేందంతా రాద్ధాంతం.. కడుపులంతావిషం.. అని ఈటలను విమర్శించారు.