‘ఒకడేమో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక గుంట తడవలేదు అంటడు. మరొకడు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం అంటడు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాళ్లే సర్టిఫికెట్లు ఇస్తరు. ఇవాళ ఇంకో ఎంపీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు మేమే ఇచ్చామని అంటడు. పాముకు రెండు నాలుకలైతే అబద్ధాల బీజేపీకి మాత్రం పది నాలుకలు’
-మంత్రి హరీశ్రావు
Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చిందంటూ పార్లమెంట్ వేదికగా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని, మరీ ఇంత దారుణమా? అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీజేపీ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.86 వేల కోట్లు ఇచ్చామని పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రకటన చేయడంపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకొన్న సొంత నిధులతో ప్రాజెక్టును పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
ఒక రూపాయి ఇవ్వకుండా కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు ఇచ్చిందంటూ చెప్పుకోవడం దారుణమని పేరొన్నారు. ‘ఒకడేమో కాళేశ్వరం ప్రా జెక్టు వల్ల ఒక గుంట తడవలేదు అంటడు. మరొకడు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం అం టడు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాళ్లే సర్టిఫికెట్లు ఇస్తరు. ఇవాళ ఇంకో ఎంపీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు మేమే ఇచ్చామని అంటడు. పాముకు రెండు నాలుకలైతే అబద్ధాల బీజేపీకి మాత్రం పది నాలుకలు’ అని మండిపడ్డారు. బీజేపీ నాయకులది తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే నీచమైన ఆలోచన అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు వస్తే ఓర్చుకోలేక బీజేపీ ఎంపీలు ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు వల్లె వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.