సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పెంచేలా కృషి చేయాలని మంత్రి సూచించారు. అవసరమైతే సత్తుపల్లి వెళ్లి ఆయిల్ పామ్ సాగును పరిశీలించాలని చెప్పారు. ఆయిల్ పామ్ సాగు వల్ల లక్షా 20 వేల కనీస లాభం వస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు సత్తుపల్లిలో బహుళ అంతస్తులు నిర్మించుకుని, కార్లు కొన్నారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాలో 7 వేల ఎకరాలు ఆయిల్ పామ్ సాగు పూర్తయిందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ఎకరానికి రూ. లక్ష సబ్సిడీ ఇస్తుందని స్పష్టం చేశారు.
గజ్వేల్ రెక్ పాయింట్ ఉన్న దృష్ట్యా ఎరువుల విషయంలో అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మధ్యప్రదేశ్లో ఎరువులు దొరక్క లైన్లో నిల్చుని ఏడుగురు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. డీఏపీ ఎరువు ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురండి, ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. వచ్చే నెల నుండి బోరు బావుల్లో వరి పంటకు నీరు కొరత ఏర్పడుతుంది. కావున ముందస్తుగా మల్లన్న సాగర్లో 15 టీఎంసీ, రంగనాయక సాగర్లో 3 టీఎంసీల నీరు నింపి ఉందన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.