మధిర: ఈ నెల 18న ఖమ్మంలో జరిగే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ చరిత్ర సృష్టించబోతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఈ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నదని ప్రకటించారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిరలోని వర్తక సంఘం భవనంలో జరిగిన సభ సన్నాహక సమావేశానికి మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 2001లో కరీంనగర్ గడ్డపై ఆవిర్భవించిన టీఆర్ఎస్ రెండు దశాబ్దాల్లో జాతీయ పార్టీ బీఆర్ఎస్గా అవతరించిందని, మొదటి సభ ఖమ్మంలో జరుగడం జిల్లా చేసుకొన్న అదృష్టమని అన్నారు. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్తోపాటు సీపీఐ, సీపీఎం జాతీయ కార్యదర్శు లు, వివిధ రాష్ర్టాల మాజీ ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్టు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్ర సర్కారు కాపీ కొడుతున్నదని విమర్శించారు. ధాన్యం కొనలేం..నూకలు తినండి అన్న బీజేపీ నేతలు ఇవ్వాళ రైతుల సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు పైసా విదల్చలేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ బోర్లకు విద్యుత్తు మీటర్లు పెడితే కేంద్రం నిధులు ఇస్తామని ప్రకటిస్తే సీఎం కేసీఆర్ అంగీకరించలేదని చెప్పారు. 65 లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ రూ.30 వేల కోట్ల నిధులు వదులుకొన్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో మధిరలో గులాబీజెండా ఎగురడం ఖాయమన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అభ్యర్థన మేరకు మధిరకు 100 పడకల దవాఖాన మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేస్తామని చెప్పారు. బహిరంగ సభలో ఏం జరుగబోతుందోనని యావత్ దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని, సభ విజయవంతానికి జన సమీకరణ చేయాలని సూచించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, జిల్లాలో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు విడుదల చేశారని పేర్కొన్నారు.
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పనులను తాను పార్లమెంట్లో ప్రస్తావించినపుడు ఎంపీలు ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి వల్లే 10 సార్లు రైతుబంధు నిధులు జమ చేశామని, రైతు కుటుంబాలను ఆదుకోవడానికి రైతుబీమా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మధిర మున్సిపల్ చైర్మన్ లత, వైస్ చైర్మన్ విద్యాలత, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్లీడర్ మల్లాది వాసు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు భారీగా హాజరయ్యారు.