హైదరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు (Seasonal disease) వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు (Gramapanchayathi worker) వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల (Sanitation workers) విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అడగకుండానే రూ.వెయ్యి వేతనాన్ని పెంచారని గుర్తుచేశారు. ఇప్పటికీ సీఎం కేసీఆర్ దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భరోసా ఇచ్చారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) కార్మికులతో చర్చలు జరిపి తప్పకుండా వీలైనంత వరకు త్వరితగతిన సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి అందరూ పని చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే (Telangana) పారిశుద్ధ్య కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ చెప్పారు. గత ప్రభుత్వాలలో రూ.500, రూ.1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో అడగకుండానే సీఎం కేసీఆర్ రూ.8,500కు పెంచారన్నారు. అలాగే అడగకుండానే ఈ మధ్యే రూ.8,500 నుంచి రూ.9,500కు పెంచిన మనసున్న మనిషి కేసీఆర్ అని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కనీసం మనుషులుగా కూడా ఆ ప్రభుత్వాలు చూడట్లేదన్నారు. ఉత్తరప్రదేశ్లో రూ.5,200, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా రూ.5,200 ఇస్తున్నారని వెల్లడించారు. ఇక ఛత్తీస్గఢ్లో పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం అసలు వేతనమే ఇవ్వడంలేదని, గ్రామ పంచాయతీలే తోచినంత ఇస్తున్నాయని చెప్పారు. ఒడిశాలో ఇంటికి రూ.5 మాత్రమే ఇస్తున్నారని, పశ్చిమ బెంగాల్లో అయితే ‘పెయిడ్ వర్కర్స్’ అని పెట్టి నెలకు రూ.500 మాత్రమే ఇస్తున్నారని, కేరళ శానిటేషన్ వర్కర్లు అని పెట్టి ఇంటికి కేవలం రూ.30 ఇస్తున్నారని వెల్లడించారు. అంటే ఒక కార్డులో పనిచేస్తే కనీసం రూ.4 నుంచి 5 వేలు కూడా రాని పరిస్థితి ఉన్నదని మంత్రి పేర్కొన్నారు.
దేశమంతా ఇలాంటి పరిస్థితులు ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి లాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకుని మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచేటట్లు చేశారని గుర్తుచేశారు. ఈ విజయంలో గ్రామ పంచాయతీల సెక్రటరీలు, మల్టీపర్పస్ వర్కర్ల పాత్ర మరువలేనిదని తెలిపారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా గౌరవంగా చూస్తుందన్నారు.
పనికిమాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని, సీఎం కేసీఆర్ కార్మికులందరినీ చల్లగా చూస్తారని, ఎలాంటి సమ్మెలు, ధర్నాల వంటి కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ పల్లెలకున్న గొప్ప పేరును ఖరాబు చేయవద్దన్నారు. అలాగే కొంతమంది క్వాలిఫైడ్ కార్మికులు ‘అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి’గా గుర్తింపునివ్వాలని కోరినట్లు, దాన్ని కూడా సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.