సిద్దిపేట, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. పారిశుధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, ఇటీవల సీఎం కేసీఆర్ అడగకుండానే వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికీ సీఎం దృష్టిలో పారిశుధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు చర్చలు జరిపి వీలైనంత వరకు సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల్లో రూ.500, రూ.1,000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో అడగకుండానే రూ. 8,500కు పెం చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ మధ్యే రూ.8,500 నుంచి రూ.9,500కు పెంచిన మనసున్న మనిషి సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులను కనీసం మనుషులుగా కూడా ఆయా ప్రభుత్వాలు చూడటం లేదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 5,200 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో రూ.5,200, ఛత్తీస్గఢ్లో అసలు ప్రభుత్వం వేతనం ఇవ్వడం లేదని, గ్రామ పంచాయతీలే తోచినంత ఇస్తున్నాయని తెలిపారు. ఒడిశాలో ఇంటికి 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, పశ్చిమ బెంగాల్లో అయితే పెయిడ్ వరర్స్ అని పెట్టి నెలకు కేవలం రూ.500 మాత్రమే ఇస్తున్నారని, కేరళ శానిటేషన్ వరర్లు అని పెట్టి ఇద్దరికీ ఇంటికి కేవలం 30 రూపాయలు ఇస్తున్నారని మంత్రి వివరించారు. పనికి మాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని, సీఎం కేసీఆర్ చల్లగా చూస్తారని భరోసా ఇచ్చారు.