ఒకే ప్రాంగణంలోని కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి
కలెక్టర్లతో హరీశ్రావు, సబిత
హైదరాబాద్, ఫిబ్రవరి 12 : విద్యార్థుల సంఖ్య వంద దాటిన పాఠశాలలను తొలివిడతలో మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి పథకం కింద ఎంపికచేయాలని మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఒకే ప్రాంగణంలో స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలుంటే, వాటిని సైతం అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. తొలివిడతలో రూ.3,497 కోట్లతో 9,123 స్కూళ్లల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’పై కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులు సమకూర్చేందుకు చేపట్టిన ఈ పథకాన్ని ఉద్యమ స్ఫూర్తితో, యజ్ఞంలా పూర్తిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష అయిన కేజీ టు పీజీకి అడుగులు పడుతున్నాయని, ఇందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సమాన నిష్పత్తిలో ఎంపికచేయాలని చెప్పారు.
కార్పొరేట్ను మైమరపించేలా..
కార్పొరేట్ స్కూళ్లను మైమరిపించేలా ప్రభుత్వ బడులను అన్ని వసతులతో తీర్చిదిద్దాలని మంత్రులు సూచించారు. అవసరమైన చోట మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, డైనింగ్హాల్స్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్తు, ఫర్నిచర్, డిజిటల్ విద్యాబోధనకు పనులు చేపట్టాల్సి ఉన్నదని చెప్పారు. పనుల అంచనాలను పక్కాగా రూపొందించాలని ఆదేశించారు. ఏ పాఠశాలల్లో వసతులు కల్పించాలో గుర్తించేందుకు కలెక్టర్లు సందర్శించాలని కోరారు. పాఠశాల నిర్వహణ కమిటీల ద్వారా నిధులు ఖర్చుచేయాలని, ఎస్ఎంసీ చైర్మన్, సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, ఇంజినీరింగ్ విభాగం ఏఈలు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. విరాళాలు అందించేందుకు ముందుకొచ్చే ఎన్నారైలు, పూర్వ విద్యార్థులు, దాతలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.