సిద్దిపేట : తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. వచ్చే ఎన్నికల్లో విజయాలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. గతంలో మత్స్యకారులకు సభ్యత్వం దొరకడం కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 7,200 మంది మత్స్యకారులకు సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి గుర్తింపు కార్డులను పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు.
దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ గంగపుత్రులకు రాష్ట్రంలోనే మొదటిసారి గుర్తింపు కార్డులు సిద్దిపేటలో ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2 వేల కోట్ల రూపాయలతో మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కొన్ని చెరువులలో సబ్సిడీపై చేప పిల్లలు వేసేవారని, నేడు రాష్ట్రంలోని అన్ని చెరువులలో ఉచితంగా వంద శాతం సబ్సిడీతో మనమే ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
సిద్దిపేట నుంచి విజయవాడ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు చేపలు ఎగుమతి అవడం గర్వ కారణమని పేర్కొన్నారు. పూటకొక దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మరు. మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్ ఏఐసీసీ మీటింగ్ పెడ్తదట. ఇక అన్నీ అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారని, 60 ఏళ్లు పాలించి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో ముందు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.
కౌరవులు ఎక్కడా గెలువరు. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారని, రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మం. కాంగ్రెస్ కౌరవుల పార్టీ. అభివృద్ధి గెలవాలా.? అబద్ధం గెలవాలా? అనే దానిపైనే మధ్య పోటీ ఉంది. ఎన్నో అద్భుతమైన విజయాలకు, దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఉందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అభివృద్ధి చేసిన పార్టీని మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ.. మంచి లీడర్ హరీశ్ రావు సిద్దిపేటలో ఉండడం అదృష్టంగా భావించాలన్నారు. సిద్ధిపేటను చూసి అందరూ నేర్చుకుని వెళ్తారు. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుని వెళ్తాను అని చెప్పారు. హరీశ్ అన్నకు ఏ శాఖ ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేస్తారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపలు, రొయ్యలు, గొర్రెల పంపిణీని ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటేనని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ను మరోసారి గెలిపించి అభివృద్ధి ఆగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రుల వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఫెడరేషన్ వైస్ చైర్మన్ డీటీ.మల్లయ్య, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.