Harish Rao | మంచిర్యాల, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ప్రజల్ని నమ్ముకుంటే.. బీజేపీ ఐటీ, ఈడీ, సీబీఐలను నమ్ముకున్నదని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకులపై గోబెల్స్ ప్రచారానికి దిగి, కేసులు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. తవ్వుడు, కూల్చుడే తప్ప బీజేపీ, కాంగ్రెస్లకు నిర్మించడం తెలియదని అన్నారు. ‘బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడితే.. సమాధులు తవ్వండి అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు సెక్రటేరియట్ కూలగొడుతా అంటున్నడు.
సమాధులు తవ్వేటోళ్లు కావాల్నా.? రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసేటోళ్లు కావాల్నా? తెలంగాణ ఆత్మగౌరవ సౌధాలను నిర్మించేటోళ్లు కావాల్నా? వాటిని కూలగొట్టేటోళ్లు కావాల్నా? ప్రజలే ఆలోచించాలె’ అని హరీశ్రావు కోరారు. బీజేపీ నాయకులు ఒక్క మంచిపని అయినా చేయకపోగా, ఉన్న సింగరేణిని సైతం అమ్మేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. చెన్నూరు ప్రాంతంలో రెండు బొగ్గుబావులను వేలానికి పెట్టి, సింగరేణిని నష్టాల బాట పట్టించేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులను బీజేపీ చేయిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు రూ.200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.
జాతి గర్వపడేలా తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నిలబెట్టారని, దేశానికే ఆదర్శంగా మారిందని హరీశ్రావు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్న పథకాలన్నీ తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్నవేనని అన్నారు. ‘మన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్, పీఎం కిసాన్ ఆత్మనిర్భర్ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. మన ముఖ్యమంత్రి ఆలోచన నుంచి వచ్చిన జిల్లాకో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని కూడా కేంద్రం కాపీ కొడుతున్నది ’ అని హరీశ్రావు స్పష్టంచేశారు.
గత పాలకులకు కేసీఆర్ పాలనకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని మంత్రి హరీశ్ చెప్పారు. ఆ నాడు పల్లెల్లో కరెంట్ ఉంటే వార్త.. ఇవాళ కరెంట్ పోతే వార్త.. అని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలకులు తాగు, సాగునీరు ఇవ్వలేకపోయారని, కనీసం ఎరువులు సరఫరా చేయడం కూడా వాళ్లకు చేతకాలేదని మంత్రి విమర్శించారు. అందుకే రోజురోజుకూ దేశంలో కాంగ్రెస్ కనుమరుగైపోతున్నదని చెప్పారు. పక్కనే గోదావరి నది ఉన్నా, రెండు మూడురోజులకోసారి నల్లా నీళ్లు వచ్చేవని.. ఇంటింటికి నల్లాపెట్టి రోజూ నీళ్లిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని హరీశ్ చెప్పారు. కరువును తరిమేసి, తెలంగాణ పరువును ఆకాశమంత ఎత్తున కేసీఆర్ నిలబెట్టారని పేర్కొన్నారు. 1600 కోట్లతో లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా పనులు ప్రారంభించనున్నట్టు హరీశ్ వెల్లడించారు. ‘గతంలో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా పనిచేశాడు. అయినా తన ప్రాంతానికి దవాఖాన కూడా తెచ్చుకోలేకపోయాడు. దవాఖాననే లేని చెన్నూరులో వంద పడకల ఆస్పత్రికి ఈ రోజు శంకుస్థాపన జరిగింది. 50 పడకల మాతాశిశు దవాఖాన కావాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరుతున్నడు. తక్షణమే మంజూరు చేస్తున్నం’ అని హరీశ్రావు ప్రకటించారు. ప్రజల కోసం పోరాటం చేసి.. ప్రాణాలకు తెగించి.. రాష్ర్టాన్ని సాధించుడే కాదు. సాధించిన రాష్ర్టాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో దేశానికే రోల్ మాడల్గా నిలిపిన కేసీఆర్ నాయకత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు.
తెలంగాణలో ఛత్తీస్గఢ్ పాలన తీసుకువస్తామన్న పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఛత్తీస్గఢ్లో రూ.500 మాత్రమే పింఛన్ ఉన్నదని, ఇక్కడకూడా దాన్నే అమలుచేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో పండే పంట భూమికి బరువవుతున్నదని.. నాట్లు వేసేందుకు, కాంటా పెట్టేందుకు ఛత్తీస్గఢ్ కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నరని తెలిపారు. రేవంత్రెడ్డి చెప్పిన ఛత్తీస్గఢ్ పాలన రావడమంటే.. తెలంగాణవాళ్లు కూడా ఇతర రాష్ర్టాలకు ఉపాధి కోసం వలస పోవడమేనని అన్నారు. యాసంగిలో వడ్లే కొనకపోవడం, వానకాలంలో 15 క్వింటాళ్లే కొనడం ఛత్తీస్గఢ్ పాలనైతే.. రైతుబంధు, రైతుబీమా, పండిన ప్రతి గింజా కాంటా పెట్టి కొనే పాలన కేసీఆర్దని హరీశ్రావు స్పష్టంచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కేసీఆర్ సారథ్యంలో సైనికుడిలా పనిచేస్తున్న బాల్క సుమన్ చెన్నూర్ను అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నాడని చెప్పారు. తునికాకు కూలీలకు బోనస్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ వారి ఉన్నతికి కృషి చేసున్నదని, మంచిర్యాల జిల్లాలో తునికాకు బోనస్ చెన్నూర్ నియోజకవర్గానికి రూ.18 కోట్లు, బెల్లంపల్లికి రూ.10 కోట్లు, మంచిర్యాలకు రూ.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గతంలో తునికాకు కట్ట ధర రూ.2.50 ఉండగా, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.3కి పెంచిందని గుర్తుచేశారు.
వచ్చే నాలుగైదు నెలల్లో బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని.. తాము దాడులకు భయపడేవాళ్లం కాదని, ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణ పులిబిడ్డలం అని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ పేర్కొన్నారు. మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వాళ్లతోనే పెట్టుకుంటున్నారని, ఆయన మాజీ ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. 2001లో సీఎం కేసీఆర్తో పెట్టుకున్నోళ్లు ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయారని, 2024 ఎన్నికల తరువాత మోదీకి కూడా అదే గతి పడుతుందని చెప్పారు. అమిత్షా చెప్పులు మోసే బ్రోకర్ బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే.. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే రేవంత్రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని అన్నారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న రాష్ర్టాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి ఆగం కానివ్వబోమని స్పష్టంచేశారు.