హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): వర్షాల ప్రభావంతో విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో మంత్రుల నివాస ప్రాంగణంలో ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని మెయింటెన్స్ ఆఫ్ సప్లయ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎంతటి భారీ వర్షాలు సంభవించినా విద్యుత్తు సరఫరా నిరంతరం కొనసాగేలా చూడాలని సూచించారు. విద్యుత్తు సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని, రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. బ్రేక్డౌన్ అయితే అత్యవసరంగా రీస్టోర్కు అవసరమైన సిబ్బందిని, మెటీరియల్ను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.