కరీంనగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన నియోజకవర్గమైన కరీంనగర్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సంక్షేమ పథకాల చెక్కులు, ప్రొసీడింగ్ కాపీలు అందించి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఉదయాన్నే కరీంనగర్లోని 22, 25వ డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ గృహలక్ష్మి ప్రొసీడింగ్లు అందజేస్తూ వీటిని సీఎం కేసీఆర్ సార్ పంపించారని లబ్ధిదారులకు చెప్పారు. వారిని ఆప్యాయంగా పలుకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు.
కేసీఆర్ సార్ పంపించిన ఈ పైసలతో ఇండ్లు మంచిగ కట్టుకోవాలని సూచించారు. నగరంలోని మరికొన్ని డివిజన్లలోనూ మంత్రి ఇంటింటికీ వెళ్లి ప్రొసీడింగ్లు అందించడంతో లబ్ధిదారుల సంతోషపడ్డారు. ఆ తర్వాత జడ్పీ సమావేశ మందిరంలో బీసీ చేయూత చెక్కులు పంపిణీ చేశారు. అక్కడ కూడా ఈ చెక్కులను కేసీఆర్ సార్ పంపించారని లబ్ధిదారులకు చెప్పారు. అనంతరం కరీంనగర్ మండలం నగునూర్, కొత్తపల్లి మండలం చింతకుంటలో గృహలక్ష్మి ప్రొసీడింగ్లు పంపిణీ చేశారు. ఇన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి పథకాల్లో రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచిగా నిలిపారని తెలిపారు.