హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దాదాపు 53 వేల దరఖాస్తులు వచ్చినట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తుకు గడువు ఉన్నదని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో గంగుల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
కులవృత్తులకు ఉపయోగపడే ముడిసరుకు, పరికరాలు కొనుగోలు చేసేందుకు ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తున్నదని తెలిపారు. దరఖాస్తుదారులు ఎవరినీ ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదని, 2021 ఏప్రిల్ నుంచి జారీ చేసిన ఆధాయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటవుతాయని వివరించారు. ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అత్యంత సరళంగా ఉన్న అప్లికేషన్ ఫారాన్ని దరఖాస్తుదారులు స్మార్ట్ ఫోన్ల నుంచి సైతం సమర్పించవచ్చని సూచించారు.