హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏక మొత్తంలో శుక్రవారం ఒక్కరోజే రూ.1180 కోట్లను రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశామని ఒక ప్రకటనలో తెలిపారు.
7030 పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని చెప్పారు. వాటికి అనుగుణంగా రైతుల ఖాతాలకు నిధులను బదిలీ చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతతో నిధుల్ని సమకూర్చుతుండటంతో వెనువెంటే చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు.