కరీంనగర్: బీజేపీకి ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ను దేశ ప్రజలు చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో అతి తక్కువ కాలంలోనే ప్రతి ఎకరాకూ నీరందించేలా సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.
అనేక రాష్ట్రాల్లో తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్ల కొద్ది నడిచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. నదుల్లో సమృద్ధిగా నీళ్లున్నప్పటికీ సాగు నీటిని అందించడంలో కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర రాజకీయాలవైపు కేసీఆర్ వెళ్తున్నారని తెలిపారు.