కరీంనగర్: దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడటం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. కరీంనగర్లో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ అభివృద్ధి గురించి కాకుండా రాజకీయాలు మాట్లాడి వెళ్లిపోయారని విమర్శించారు. కొత్తగా కర్మాగారాలు ప్రకటిస్తారనుకున్నామని చెప్పారు. ప్రధాని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు.
సీఎం కేసీఆర్కు పీఎంఓ నుంచి ఆహ్వానం కూడా అందలేదని, ఇదేనా బీజేపీ సంస్కృతి అని ప్రశ్నించారు. రాష్ట్రాలను పట్టించుకోకపోతే బీజేపీకి చుక్కెదురుకాక తప్పదని చెప్పారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఆటలు సాగవని చెప్పారు. కాగా, తొమ్మిదేండ్లలో కరీంనగర్ను అద్భుతంగా అభివృద్ధి చేశామని వెల్లడించారు. పర్యాటకుల కోసం కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామని తెలిపారు.