హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతిగింజను కొంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కేంద్రం ఆంక్షలు పెడుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతుల తరఫున నిలబడి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ధాన్యం కాంటా అయిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్టు వివరించారు. ధాన్యం కొనుగోళ్లు, ఏర్పాట్లు, ఇతర అంశాలపై మంత్రి గంగుల నమస్తే తెలంగాణకు శనివారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 7100 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే రెండు వేల కేంద్రాలను పలు జిల్లాల్లో ప్రారంభించాం. 1.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ప్రతి కేంద్రంలోనూ అవసరమైన టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్స్, మాయిశ్చర్ మిషన్లు, గన్నీ సంచులు సమకూర్చాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కాంట పెట్టిన వారం రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతాయి.
కేంద్రాలు పెట్టలేదని, ధాన్యం కొనడం లేదనే విమర్శలపై మీ సమాధానం?
ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. ధాన్యం కొనడం లేదనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. ఎక్కడ వరి కోతలు ప్రారంభమైతే అక్కడ.. కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కొందరు రైతులు పచ్చి ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెట్టుకుంటున్నారు. అవి ఆరిన తర్వాత కాంటా పెడతారు. కానీ, కొందరు ఆ ధాన్యం కుప్పలను చూపిస్తూ పేరుకుపోయిన ధాన్యం రాశులని అసత్య ప్రచారం చేస్తున్నారు.
మిల్లర్ల ఆగడాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
తరుగు పేరుతో ధాన్యంలో కోత పెడుతూ రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు. రైతుల నుంచి ఫిర్యాదు అందిన మిల్లుపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ మిల్లులకు ధాన్యం బంద్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడతాం. కొనుగోలు కేంద్రంలో ఎంత తూకం వేశారో మిల్లులో అన్లోడ్ చేసిన తర్వాత షీట్లో అంతే తూకం ఉండాలి. ధాన్యంలో కోత పెట్టే మిల్లులపై ఫిర్యాదు చేయాలి. ఈ సమస్యపై ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. డీఫాల్ట్ మిల్లులకు ధాన్యం ఇవ్వొద్దని నిర్ణయించాం.
తెలంగాణ తరహాలో మరే రాష్ట్రంలోనైనా ధాన్యం కొనుగోలు చేస్తున్నారా..?
రైతుల నుంచి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. రైతులకు రవాణా ఖర్చు లేకుండా ముంగిట్లో కాంటా పెట్టి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఇతర రాష్ర్టాల్లో రైతులు తమ ధాన్యాన్ని దూర ప్రాంతాల్లోని మార్కెట్కు తీసుకెళ్లాల్సిందే.
ఎంత ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు?
ఇప్పటివరకు రూ.1.21 లక్షల కోట్ల విలువైన 6.76 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈ యాసంగి సీజన్లో తెలంగాణ చరిత్రలో రికార్డు స్థాయిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కేంద్రాలకు 80-90 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశాం. ఇందుకోసం రూ.15-18 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా.
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు పెడుతున్నదా…?
యాసంగిలో రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ ఉత్పత్తి అవుతుందని, రా రైస్ ఉత్పత్తి కాదని మొరపెట్టుకుంటున్నా.. కేంద్రం మాత్రం తమకు రా రైసే మాత్రమే కావాలని మొండికేస్తున్నది. అంటే రైతుల నుంచి దొడ్డు ధాన్యం కొనొద్దని పరోక్షంగా చెప్తున్నది. కానీ, కేంద్రం మాదిరిగా రైతులను గాలికొదిలేసే వ్యక్తి కాదు సీఎం కేసీఆర్. ఇబ్బందులెదురైనా సరే రైతులకు నష్టం లేకుండా మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.
రైతులకు మీరెచ్చే
రైతులకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
రైతులు కొనుగోలు కేంద్రాలకు పచ్చి ధాన్యం కాకుండా ఆరబెట్టి, తూర్పారబట్టి, తాలు, పొల్లు లేకుండా నిబంధనల ప్రకారం తీసుకురావాలి. పచ్చిధాన్యం తీసుకొచ్చి అధికారులను ఇబ్బంది పెట్టొద్దు, కొనుగోలులో, తూకంలో, మిల్లర్ల వద్ద ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులకు లేదా కలెక్టర్లకు ఫిర్యాదు చేయండి. అకాల వడగండ్ల వర్షాలు కురుస్తుండటంపై అప్రమత్తంగా ఉండాలి. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని ఉపయోగించుకోండి.