కరీంనగర్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నంలో ఉందని, ఎట్టి పరిస్థితులోనూ కేంద్ర చర్యలను అడ్డుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయమై ఏకగ్రీవ తీర్మానం చేయించారు. దీని ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు.
రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిన 24 గంటల్లోనే చెల్లింపులు జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంతో గతంలో బీళ్లుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయన్నారు. ఇదంతా చూస్తున్న కేంద్రప్రభుత్వం కండ్ల మంటతో కొనుగోళ్లను ప్రైవేట్పరం చేసే కుట్రలు పన్నుతున్నదని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. డెంగ్యూపై భయపడాల్సిన అవసరం లేదని, దీన్ని అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ బస్తీ, పల్లె దవాఖానాలు తెచ్చారని, ఈ దవాఖానాల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, జడ్పీ సీఈవో ప్రియాంక పాల్గొన్నారు.