కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 10 : తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టవద్దని, కేసీఆర్ చేతుల్లోనే సురక్షితంగా ఉంటుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కేసీఆర్ సీఎంగా లేని తెలంగాణను ఉహించుకోలేమని, అది భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం కరీనంగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి, కమాన్పూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సాయంత్రం కరీంనగర్లోని 36, 53, 54వ డివిజన్లలో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి గంగులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు సమైక్య పాలనలో తాగు, సాగునీటి కోసం ఎంతో గోసపడ్డామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పింఛన్లు ఇవ్వలేదని, కొత్త పింఛన్ రావాలంటే మరో లబ్ధిదారుడు చావుకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. స్వయం పాలనలో తెలంగాణలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతూ ఇప్పుడిప్పుడే తెలంగాణ పచ్చబడుతున్నదని చెప్పారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టాలని కొన్ని శక్తులు ఒక్కటై కేసీఆర్ను ఓడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ను ఆంధ్రాలో కలిపేసే యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, బీజేపీ మాటలు విని తప్పు చేస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని హెచ్చరించారు. స్వయం పాలనలో రూ.వేల కోట్లతో కరీంనగర్ను అభివృద్ధి చేసుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి అధికారం కట్టబెడితే మళ్లీ ఇకడి యువత ఉపాధి లేక ముంబై, దుబాయ్, భీవండి ప్రాంతాలకు వలస పోయే రోజులు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ను ఎందుకు ఓడగొట్టాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు ఓడగొట్టించాలా? అని నిలదీశారు. దుష్టశక్తులకు అధికారమిచ్చి మన భవిష్యత్తరాల నోట్లో మట్టి కొట్టొద్దని సూచించారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని యువతకు భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.