కరీంనగర్: జనాభాలో 56 శాతం ఉన్న బీసీల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కేంద్రం తీరువల్ల బీసీలకు (BC’s) చాలా అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 25న నిర్వహించనున్న బీఆర్ఎస్ (BRS) నియోజకవర్గ స్థాయి ప్లీనరీ ఏర్పాట్లను కరీంనగర్లో (Karimnagar) సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కేంద్రం రూ.46 లక్షల కోట్లతో బడ్జేట్ప్రవేశపెడితే.. అందులో బీసీ సంక్షేమం కోసం కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు రూ.2 వేల కోట్లు దేనికి సరిపోతాయని ప్రశ్నించారు. బీసీలకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఉంటే కచ్చితంగా ఆ శాఖకు ఎక్కువగా నిధులు కేటాయించేవారని, తద్వారా బీసీలకు న్యాయం జరిగేదన్నారు.
దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని కోరుతున్నప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. చట్ట సభల్లో రిజర్వేషన్ విషయంలోనూ అదే వివక్ష కొనసాగుతున్నదని చెప్పారు. వీటిన్నంటిపై మంగళవారం జరిగే బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో తీర్మాణం చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈనెల 27న పార్టీ అవిర్భావాన్ని పురష్కరించుకొని రాష్ట్ర స్థాయిలో ప్లీనరీ ఏర్పాటుచేస్తుండగా ఈనెల 25న అన్ని నియోజకవర్గల్లో మినీ ప్లీనరీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సమాజం కేసీఆర్ను (CM KCR) మాత్రమే నాయకుడిగా గుర్తిస్తుందన్నారు. రాష్ట్ర సాధనకోసం నాడు ఉద్యమాలు చేసి.. నేడు అభివృద్ధికోసం అహర్నిశలు శ్రమిస్తున్న కేసీఆర్కు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం కల్పించారని తెలిపారు. ఎవరెన్ని అసత్య ఆరోపణలుచేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.