కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో 65 శాతం జనాభా ఉన్న బీసీలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. బీసీ ప్రధాని ఉండి కూడా బీసీలకు సంబంధించి మూడు డిమాండ్లను ఎనిమిదేండ్లయినా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కుల గణన, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ డిమాండ్లను నెరవేర్చాలని అన్నా రు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కనీసం ఈ డిమాండ్లపై చర్చించకపోగా ప్రధాని తన ప్రసంగంలో మాట మాత్రమైనా మాట్లాడకపోవడం బీసీవర్గాలపై ఆయనకున్న నిర్లక్ష్యానికి నిదర్శమని పేర్కొన్నారు.
సోమవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశా ల్లో బీసీ బిడ్డగా ప్రధాని మోదీ బీసీలకు సంబంధించి పాజిటివ్ డిక్లరేషన్ చేస్తారని ఆశించామని చెప్పారు. దేశంలో బీసీల్లో 2,900 కులాలు ఉంటే.. 2,850 కులాలు నేటికీ చట్ట సభలకు దూరంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా పై మూడు డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో జరుగబోయే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వానకాలం పంట కొంటారా..? కొనరా..?
రాష్ట్రంలో 2,950 రైస్ మిల్లులు మూత పడ్డాయని, వాటిపై ఆధారపడ్డ ఎంతో మంది రోడ్డున పడ్డారని, ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారో ప్రజలకు వివరణ ఇవ్వాలని బీజేపీ నేతలను మంత్రి గంగుల డిమాండ్చేశారు. అంతేకాదు వర్షకాలం పంట కొంటరా..? కొనరా..? ఏదో ఒకటి తేల్చిచెప్పాలని నిలదీశారు. మాటిమాటికి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నాయకులు ఉత్తరకుమార పగల్భాలు పలుకుతున్నారని, దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకొని చూడండని సవాల్ విసిరారు. ముందు రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని, ఇప్పటికే వారు తలో దిక్కువెళ్లాలని చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ గడ్డపై కేసీఆర్ ఉన్నంత వరకు బీజేపీ ఏమీ చేయలేదని అన్నారు. సీఎం కేసీఆర్ను ప్రజలు గుండెల్లో పెట్టిచూసుకుంటారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసు, కరీంనగర్ మేయర్ సునీల్రావు, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవిందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.