Minister Gangula | బీసీ కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వేడుకల విజయవంతం చేయాలని ఆదేశించారు. కులవృత్తుల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష గ్రాంట్ను అందించే అందించే కార్యక్రమానికి సంబంధించి సహచర మంత్రి హరీశ్రావు, సీఎస్ శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంచిర్యాలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులను అందించి, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. అదే రోజు జిల్లాల పరిధిలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో లబ్ధిదారులకు చెక్కులు అందించాలని సూచించారు.
కులవృత్తుల్లో కొనసాగుతున్న వారిని అభివృద్ధి చేసేందుకు, వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని పునరుద్ఘాటించారు. పథకం దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇది నిరంతర కార్యక్రమం అని, దీని కింద లబ్ధిదారులను గుర్తించి ప్రతినెలా 15న లబ్ధిదారులకు సంబంధిత ఎమ్మెల్యేలతో చెక్కులు పంపిణీ చేస్తామని మంత్రి గంగుల తెలిపారు. అయితే ఈ దరఖాస్తులను పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
పథకం గ్రౌండింగ్లో ఆయా కులవృత్తులకు దోహదపడే పనిముట్లు, పరికరాలు కొనుగోలు చేసేందుకు లబ్ధిదారులకు సహకరించడంతో పాటు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని, రెండేళ్ల వరకూ ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా లబ్ధిదారులకు ఆర్థికంగా ఉన్నత స్థితిని సాధించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. సంగారెడ్డి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో హరీశ్రావు పాల్గొన్నారు. నిరుపేద చేతివృత్తిదారులను గుర్తించి వారికి ఆర్థిక చేయూతనిచ్చేలా కలెక్టర్లు శ్రద్ధ వహించాలని సూచించారు. వీసీలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం, ఎస్సీ డెవలప్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.