కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇస్తున్న హామీలను నమ్మొద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు సూచించారు. ఐదు నెలల క్రితం కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జరిగిన పర్యటనలో రాహుల్ అసత్యపు ఆరోపణలు చేయడమేకాకుండా, అమలుకు నోచని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై పచ్చి రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని చెబుతున్న రాహుల్గాంధీ, రాష్ర్టాన్ని పాలించిన 50 ఏండ్లలో ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు భూములు గుంజుకున్నారే తప్ప నీళ్లు ఇవ్వడం లేదని రాహుల్ అంటున్నారని, ఆయన గురు, శుక్రవారాల్లో తిరిగింది అంతా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లొస్తున్న ప్రాంతమేనని చురకలంటించారు.
ఒకసారి మంథని మీదుగా ప్రాజెక్టు వద్దకు వెళ్లి చూసి వస్తే.. ప్రాజెక్టు ఎంత గొప్పదో తెలిసేదని అన్నారు. ఆయన పర్యటించిన ప్రతి ప్రాంతంలో రైతులను అడిగితే కాళేశ్వరం నీళ్లు వచ్చాయా? రాలేదో? చెప్పేవారని అన్నారు. కాళేళ్వరం సాగునీటి రంగ చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత ప్రాజెక్టు అని, దీన్ని ప్రపంచమే గుర్తించిందని పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు రాహుల్ గాంధీకి కన్పించకపోవడం దారుణమన్నారు.