కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ-2 డిపో ఆవరణలో ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ఆధునాతన లగ్జరీ బస్లను ప్రారంభించి మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం 51 లగ్జరీ బస్లను కొనుగోలు చేసిందని దాంట్లో భాగంగా కరీంనగర్ డిపోకు మూడు బస్లు కేటాయించిందన్నారు. ఒక్కో సూపర్ లగ్జరీ బస్సు విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని, బస్సులు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్లే ప్రయాణికులకి అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ లగ్జరీ బస్సులో 36 రెక్లైనర్ సీట్లతో పాటు పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.
బస్సులో సెల్ ఫోన్ చార్జర్తో పాటు మహిళల భద్రత కోసం సీసీ కెమెరాలు, ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సైరన్ వస్తుందని వెల్లడించారు. ఫిబ్రవరి ఒకటి నుంచి కరీంనగర్ నుంచి యాదాద్రికి రోజు 2 బస్సులు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.