హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం పాటు పడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పల్లె రవికుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ బీసీలు వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని తెలిపారు. బీసీలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్(CM KCR) ఎనలేని సేవ చేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అన్నారు. గౌడ కులస్థులు ఆర్థికంగా, ఆత్మగౌరవంతో బతికేలా సర్కార్ చేయూత అందిస్తుందని పేర్కొన్నారు.
నీరా కేప్(Neera Cafe) ను ప్రారంభించడంతోపాటు గౌడ బీమా(Gowda Insurance) సైతం ప్రకటించారని, ఉద్యమకారుడు వెనుకబడిన వర్గాల ప్రతినిధి పల్లె రవికుమార్ గౌడ్ కు సీఎం కేసీఆర్ గొప్ప అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు , గౌడ వృత్తిదారులు పాల్గొన్నారు.