హైదరాబాద్, జనవరి 2 /కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేపట్టిన దీక్ష ఉద్యోగుల మీద ప్రేమతో కాదని, కేవలం తన రాజకీయ ప్రయోజనం కోసమేనని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. దీక్ష చేపట్టేముందు అధికారుల నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. స్వయంగా ఎంపీ అయ్యి ఉండి చట్టాన్ని ఉల్లంఘిస్తావా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.కరోనా ప్రబలితే ఎవరు బాధ్యుత వహిస్తారని ప్రశించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం రాత్రి కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట తప్పినందుకు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు దీక్ష చేయాలని బండి సంజయ్కి సూచించారు. 317 జీవో గురించి బండి సంజయ్కి ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విభజనపై గుర్తింపు పొందిన 8 ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలతో ప్రభుత్వం చర్చించిందని, ఆ సంఘాలు లిఖితపూర్వకంగా ఇచ్చిన సూచనల ప్రకారమే జీవో విడుదల చేశామని స్పష్టంచేశారు. ‘ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నువ్వు ఏవైనా అభ్యంతరాలుంటే సవరించాలని ప్రభుత్వనికి లేఖ రాశావా? ముందస్తు అనుమతి తీసుకోకుండా, కొవిడ్ నిబంధనలు పాటించకుండా దీక్షకు కూర్చుంటా అంటే ఎలా! దీక్షకు భారీ సంఖ్యలో జనం వచ్చి కరోనా వ్యాపిస్తే కరీంనగర్ను ఎవరు కాపాడుతారు? దీక్ష చేయాలనుకుంటే ఒక్కడివే చెయ్యి, జాగరణ పేరుతో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? కొవిడ్ కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వమే సూచించింది. చట్టాన్ని అతిక్రమించి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కొవిడ్ వ్యాప్తి చెందకముందే సంజయ్ని అరెస్ట్ చేసినందుకు పోలీసులను అభినందిస్తున్నా. ఇకపై కొవిడ్ కేసులు పెరిగితే సంజయే బాధ్యత తీసుకోవాలి. కొవిడ్ నిబంధనలు అతిక్రమించి నేను దీక్షచేసినా పోలీసులు అరెస్ట్ చేయవచ్చు’ అని చెప్పారు.
ఉద్యోగులను బలిపెట్టొద్దు
రాష్ట్రంలో బదిలీలు, అలాట్మెంట్ల ప్రక్రియ జరుగుతున్నది. జిల్లాల్లో 90 శాతం విభజన పూర్తయ్యింది. జోనల్ విభజన పూర్తి కావస్తున్నది. దీనికి రాజకీయ రంగు పూసి నిరుద్యోగులకు నష్టం చేస్తారా? ఉద్యోగాలు భర్తీ చేయాలంటూనే ఉద్యోగుల విభజన చేయవద్దని అంటున్నారు. మీ(బండి సంజయ్) రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఉద్యోగులను, నిరుద్యోగులను బలిపెట్టవద్దని కోరుతున్నాం. -మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు
ఉద్యోగులను రెచ్చగొట్టవద్దు
ఉద్యోగుల విభజన అతి పెద్దదైన, క్లిష్టమైన ప్రక్రియ. ఈ క్రమంలో సీనియారిటీలో తప్పులున్నా, తప్పిదాలు జరిగినా అధికారులు అప్పీళ్లు తీసుకొంటున్నారు. వాటిని వీలైనంత త్వరగా సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యను భూతద్దంలో చూపెట్టి ఉద్యోగులను రెచ్చగొట్టడం సరికాదు. ఉద్యోగుల విభజన పూర్తయితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.
– మమత, టీజీవో అధ్యక్షురాలు
సంఘాల ఆమోదంతోనే..
ఉపాధ్యాయ సంఘాల ఆమోదంతోనే ప్రభుత్వం జీవో 317 జారీ చేసింది. ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు. టీచర్ల జిల్లా కేటాయింపుల విషయంలో గుర్తింపు పొందిన 8 ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖమంత్రితో పాటు ఉన్నతాధికారులు చర్చించారు. ఈ జీవోను కొంత మంది రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టీచర్లను బజారుకు లాగడం మంచి పద్ధతి కాదు. -తిరుపతిరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
వంక పెట్టడం కొందరికి అలవాటు
జీవో నంబర్ 317 సముచితంగానే ఉన్నది. ఏ జీవో ఇచ్చినా ఏదో ఒక వంక పెట్టడం కొంతమందికి అలవాటుగా మారింది. టీచర్ల జిల్లా కేటాయింపులు, బదిలీల విషయంలో గతంలో ఏ ప్రభుత్వం ముందుస్తుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన దాఖలాలు లేవు. కానీ, ఈ ప్రభుత్వం చర్చలు జరిపింది. టీచర్ల సమస్యలను మాకు మేముగా పరిష్కరించుకొనే సత్తా ఉన్నది. – వేణుగోపాల్రావు, జనరల్ సెక్రటరీ, తెలంగాణ పీఆర్టీయూ