హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ కలెక్టరేట్: ప్రతి నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులు, చేతి వృత్తిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని, ప్రతినెలా 15వ తేదీన అప్పటివరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిస్తామని స్పష్టంచేశారు. ఇదే అంశంపై గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. బీసీ కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బీసీ కులవృత్తులకు 1 లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, ప్రతి నియోజకవర్గంలో 300 మందికి ఈ నెల 15న స్థానిక ఎమ్మెల్యేల చేతులమీదుగా రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులు అందిస్తామని వెల్లడించారు.