హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓర్వడం లేదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తుందని, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు అడ్డుకట్ట వేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు.
సీఎం కేసీఆర్ రైతుబిడ్డ కాబట్టే వ్యవసాయరంగానికి పెద్దపీట వేసి, రైతులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి పంట పొలాలకు కాళేశ్వరం జలాలు అందించడంతో పాటు సకాలంలో ఎరువులను అందించడం, పంట పెట్టుబడి సాయం, రైతుబీమా, రైతుబంధు తదితర పథకాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్కు ఒరిగేదేమి లేదని, రాష్ట్రానికి రక్షణ కవచంగా సీఎం కేసీఆర్ నిలిచారన్నారు.
నిబంధనల ముసుగులో ఆర్థికంగా తెలంగాణను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి తేని బీజేపీ నేతలు తెలంగాణ సర్కారును, సీఎం కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ముందు వరుసలో ఉండి ప్రారంభోత్సవాలు చేస్తూ తిరిగి బీఆర్ఎస్ సర్కార్పైనే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు విమర్శలు చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవాలని డిమాండ్ చేశారు.
రైతుల కోసం కల్లాలు కట్టిస్తే ఆ డబ్బులు తిరిగి వాపసు ఇవ్వమని అడగడం సిగ్గుచేటని, తెలంగాణను ఆర్థికంగా అణచివేయాలని కేంద్రం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. అంబాని, అదానీలాంటి బడా వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్న కేంద్ర సర్కార్కు రానున్న రోజుల్లో రైతులు, ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. గతంలో మోడీ సర్కార్ పంజాబ్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైతుల తిరుగుబాటుతో వెనక్కి తగ్గలేక తప్పలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు.