వరంగల్: జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మన ఊరు- మన బడి, కరెంట్, మంచినీరు సరఫరా, వివిధ మరమ్మతులు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కోసం మొత్తం రూ.40లక్షల 19 వేలతో శంకు స్థాపనలు చేశారు.
రూ.80 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో డంపింగ్ యార్డ్ పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఆశాలపల్లి గ్రామానికి 286 ఆసరా పెన్షన్లు, 720 మందికి రైతు బంధు, 44 మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా నిధులు, 44 మంది కి వడ్డీ లేని రుణాలు, 24 కేసీఆర్ కిట్ లు, 3 ముగ్గురు రైతులకు రైతుబీమా అందించినట్లు మంత్రి తెలిపారు.
కార్యక్రమలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.