హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
2022-23 ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో మంగళవారం ప్రసంగించిన సీఎం కేసీఆర్ పేదరిక నిర్మూలనలో భాగంగా డ్వాక్రా మహిళల సంఘాలకు నిధులు అందించి, విశేష సేవలు చేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ (SERP) లోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందిస్తామని ప్రకటించారు.
అలాగే ఇందులో భాగంగా పని చేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని సీఎం తెలిపారు. మరోవైపు గత కొంత కాలంగా ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామన్నారు.
అయితే భేషజాలకు పోయి ఆందోళనలు, ధర్నాలు చేయవద్దని, అలా చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. దీంతో 7,305 ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి వారి ఉపాధి వారికి లభించినట్లు అయింది.కాగా,సెర్ప్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం, మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు.