మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటే బీజేపీ కీడు చేసే ఆలోచనలో ఉందని దుయ్యబట్టారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయ భవనం, గోదాములను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఆందోళనలో ఉండే రైతులు తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్(CM KCR) దయ వల్ల సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కరెంటు, సాగునీరు, ఎదురు పెట్టుబడి ఇచ్చి రైతులకు మేలు చేస్తుంటే, కేంద్రంలో బీజేపీ (BJP)ప్రభుత్వం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. దేశ వ్యాప్తంగా రైతుల కోసం ఉద్యమించిన ఏడు వేల మంది రైతులను కేంద్రం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు.
24 గంటల కరెంట్ , రైతు బంధు, రైతు బీమాలాంటి పథకాలు దేశంలో ఎవరైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) హైదరాబాద్ వేదికగా రూ.200 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. నేడు రూ. 1250కు పెంచారని,పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ అని విమర్శించారు.ప్రజలను, రైతులను మోసం చేస్తున్న బీజేపీ ని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్ వేంకటేశ్వర రెడ్డి, డైరెక్టర్, తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ కకిరాల హరిప్రసాద్, డైరెక్టర్లు, రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.