ములుగు, ఏప్రిల్ 18 (నమస్తేతెలంగాణ): ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి అని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 800 ఏండ్లనాడే వారు అవలంబించిన టెక్నాలజీ సైన్స్కు సైతం సవాల్గా మారిందని అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో ‘శిల్పం-వర్ణం-కృష్ణం’ సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప అనే థీమ్తో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
రామప్పలో పేరిణి నృత్యం చేస్తున్న కళాకారులు
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఏటా ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉత్సవాలు జరుగుతుండేవని, సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ సారి రామప్పలో నిర్వహించినట్టు చెప్పారు. తరతరాల చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకే ఉత్సవాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణ నైపుణ్య, విశిష్ట కళ, ప్రాంత చరిత్ర, రామప్ప శిల్పాలలో దాగి ఉన్నదని వెల్లడించారు.
800 ఏండ్ల క్రితమే తెలంగాణ ప్రజలు ఎంతో తెలివి కలిగిన వారని, కాకతీయులు నిర్మించిన రామప్పను చూస్తే తెలుస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతోనే యునెస్కో గుర్తింపు సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ ప్రాంత గొప్పతనం రామప్పకు యునెస్కో గుర్తింపు ద్వారా యావత్ ప్రపంచానికి తెలిసిందని అన్నారు. చారిత్రక, సాంస్కృతిక కేంద్రంగా ఉన్న వరంగల్ నగరంలో ఏడాది పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఉత్తర తెలంగాణకు సంబంధించి వరంగల్ నగరంలో, దక్షణ తెలంగాణలో మహబూబ్నగర్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఏడాది పొడవునా ప్రతి నెలలో ఒకటి చొప్పున సాంస్కృతిక, క్రీడలు నిర్వహించేలా త్వరలోనే క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
తెలంగాణకు గర్వకారణం రామప్ప: సత్యవతి
కాకతీయుల కళా వైభోగం, శిల్ప కళలతో పర్యాటకుల మనసు దోచుకుంటున్న రామప్ప దేవాలయం యావత్ తెలంగాణకే గర్వకారణమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు వచ్చేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు. పర్యాటక ప్రాంతంగా ములుగు జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.
చరిత్రలో మిగిలేలా రామప్ప అభివృద్ధి: ఎర్రబెల్లి
చరిత్రలో నిలిచేలా రామప్పను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో రామప్ప చరిత్రను స్వయంగా తెలుసుకొని కాకతీయులు పడ్డ కష్టాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే యునెస్కో గుర్తింపునకు తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. ప్రపంచంలోని 17 దేశాల మద్దతుతో ఈ గుర్తింపు లభించిందని చెప్పారు. పర్యాటక శాఖ ద్వారా రామప్పను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.