హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు దాదాపుగా చెల్లించామని ఇంకా ఏమైనా అరకొర నిధులు బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ఈజీఎస్ మెటీరియల్ కంపోనెంట్ బకాయిలు రూ. 1140 కోట్లు
రాష్ట్రం విడుదల చేసిన నిధులు రూ.166 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జీపీ రోడ్లకు ట్రెజరీల ద్వారా రూ.760 కోట్ల విలువైన లక్షా 45 వేల చెక్కులను జీపీలకు అందజేశామన్నారు.
తెలంగాణ సర్పంచుల సంఘం నేతలతో గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో సమావేశం అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం నేతలు సౌదని భూమన్న యాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాలకొండ ప్రనీల్ చందర్ వివిధ అంశాలపై మంత్రితో చర్చించారు. పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని సర్పంచులు కోరగా.. ఆ బిల్లులకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా మంత్రి వారికి వివరించారు.
కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు రాగానే సీసీ రోడ్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర అమోఘమని మంత్రి తెలిపారు. సర్పంచులకు బీమా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. పల్లె ప్రగతి తర్వాత సర్పంచుల విస్తృత స్థాయి సమావేశం ఉంటుందన్నారు. మంత్రి వివరణతో సర్పంచుల సంఘం నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.