పెద్ద వంగర (పాలకుర్తి నియోజకవర్గం) సెప్టెంబర్ 12 : గిరిజనులు, ఆదివాసీల ఏండ్ల గోసను సీఎం కేసీఆర్ ఎడబాపి గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుంటే.. ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్ద వంగర మండలంలో తండా బాట నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయా తండాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి మాట్లాడారు. ఒక్కో గ్రామానికి కోటి రూపాయలతో అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో గతంలో కనీవినీ ఎరగని రీతిలో తండాలను సైతం గ్రామాలకు దీటుగా అభివృద్ధి పరచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ కుట్రపన్నుతున్నదని మండిపడ్డారు. రైతుల నడ్డి విరవడానికి 3 గంటల కరెంటు చాలంటోంది. 24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు కావాలా? 3 పంటల బీఆర్ఎస్ కావాలో తేల్చుకోవాలన్నారు.
గ్రామాలకు దీటుగా తండాలను తాను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమేగాక, ఒక్కో తండాకు కోటి రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. గిరి జిల్లా అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ కి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.