తెలంగాణలోని సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో ఉన్నాయా?
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
తొర్రూరు/పర్వతగిరి, జూన్ 10 : దేశాన్ని 70 ఏండ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కారణంగా సామాన్యుడి జీవితం సర్వనాశనమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఇవి రెండు కూడా చేతకాని పార్టీలేనని ఆయన ఆరోపించారు. శుక్రవారం మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ శశాంకతో కలిసి తొర్రూరు మండలం గుర్తూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల పొదుపు సంఘాల మహిళలకు రూ.8.47 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కులు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో రూ.10 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, రైతు వేదిక, అంతర్గత సీసీరోడ్లను ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కలెక్టర్ గోపితో కలిసి ప్రారంభించారు. అనంతరం పర్వతగిరి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులకు 12 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో రాష్ట్రంలో పల్లెల రూపురేఖలు మారుతున్నాయన్నారు.
70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్లలోనే సీఎం కేసీఆర్ పాలనలో సాధ్యమైందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతోపాటు తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి ద్వారా పట్టణాలతో సమానంగా అన్ని సౌకర్యాలను కల్పిస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో నిధుల విడుదలను అడ్డుకుంటున్నదన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. రూ.2 వేల ఆసరా పెన్షన్, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథతో ఇంటింటికి సురక్షిత మంచినీరు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్ర మంత్రి అమిత్షా ఒత్తిడి తెస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం తలొగ్గకుండా.. రైతుల పక్షాన నిలిచారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలువాలని కోరారు.