మహబూబాబాద్ : దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) పేర్కొన్నారు. గిరిజనులపై ప్రత్యేక అభిమానం ఉండడం వల్లే సమస్యకు పరిష్కారం దొరికిందని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం లో మంత్రులు కేటీఆర్(Minister KTR), సత్యవతి రాథోడ్(Satyavati Rathod) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సమైక్య పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేక పోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో మహబూబాబాద్ జిల్లా ఊహించని అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో లక్షా 51 వేల 146 మంది గిరిజనులకు పోడు భూముల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 181 మంది లబ్ధిదారులకు 67 వేల 730 ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటికే వానాకాలం పంట సహాయం కింద జిల్లాలో సుమారు రూ.33.86 కోట్ల రైతుబంధు(Raitu Bandu)ను అందించామని పేర్కొన్నారు. కొత్తగా పోడు పట్టాలు పొందే గిరిజన రైతులకు సైతం రైతుబంధు పంట పెట్టుబడి సహాయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేసిన కేసీఆర్కు ప్రజలు రుణపడి ఉండాలని కోరారు.3,146 తండాలు, గూడాల ను గ్రామపంచాయతీలుగా చేశామని తెలిపారు. కాంగ్రెస్ పాలకుల విమర్శలు, కుట్రలు తిప్పి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.