వరంగల్ : నిరంకుశ నిజాం రజాకార్లు, దేశ్ ముఖులను ఎదుర్కొన్న వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని శాయంపేట సర్కిల్లో గల ఆమె విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తి దాయకం అన్నారు. ఐలమ్మ స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారు.
అదే స్ఫూర్తిని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారు. పరిపాలనలో ఉద్యమ స్ఫూర్తిని పాటిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా మారిందన్నారు.
ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటం పట్ల సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, తదితరులు పాల్గొన్నారు.