కొడకండ్ల, సెప్టెంబర్ 20 : పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని నరసింగాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ నూనెముంతల వినోద భర్త సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న మంత్రి బుధవారం సత్తయ్య మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొని పాడే మోశారు. అదేవిధంగా ఏడు నూతుల గ్రామానికి చెందిన కుదురుపాక రాములు మృతి చెందగా మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, ఈజీస్ కౌన్సిల్ సభ్యులు అందే యకయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, సీనియర్ నాయకులు చెంచు రాజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.