Minister Errabelli | పల్లె ప్రగతి, గ్రామీణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ, హరితహారం మొక్కల సంరక్షణ వంటి అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. వరంగల్ – హన్మకొండలోని తమ క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. మిగిలి ఉన్న వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుకు, పల్లె ప్రకృతి వనాలు, పల్లె బృహత్ ప్రకృతి వనాలని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని చెప్పారు. పారిశుధ్య పనులను నిరంతరం నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ పనులను వినియోగిస్తూ అభివృద్ధి పనులను చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
హరిత హారం పథకం కింద నాటిన మొక్కలను సంరక్షించడానికి తౌటం పెట్టి, నీటిని అందించాలని చెప్పారు. వంద శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల, అంగన్ వాడి కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చెప్పారు. అలాగే పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, టాయిలెట్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పంచాయతీల సీసీ ఛార్జీలు, కిస్తీలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కరోనా మరో వేవ్ ఘంటికలు మోగుతున్నాయని, పంచాయతీ రాజ్ అధికారులు, ప్రత్యేకించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచేలా పనులు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షలో మహబూబాబాద్, వరంగల్ జిల్లాల జెడ్పీల సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.