పర్వతగిరి(వరంగల్) : తండాలు, ఆదివాసి గ్రామాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా పర్వత గిరి మండలం, మాల్యా తండాలో తెలంగాణ గిరిజన సంక్షేమ దినోత్సవాన్ని(Tribal Welfare Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సేవాలాల్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 3,146 తండాలను, ఆదివాసీ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేశారని తెలిపారు. గిరిజనుల గృహవసరాల కోసం 101 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనులు పారిశ్రామికవేత్తలు గా ఎదగడానికి ప్రభుత్వం తరుపున ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. గిరిజనులకు నాణ్యమైన విద్య అందించడానికి గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.