జనగామ : ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పోలీసు శాఖ వ్యవస్థపై గౌరవం పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సురక్ష దినోత్సవ (Suraksha Day) ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్(Friendly Police) వ్యవస్థ అమలవుతుందని పేర్కొన్నారు. పోలీసులకు హై ఎండ్ వాహనాలు ఇచ్చారని, పోలీసులకు పదోన్నతులు కల్పించారని, హోంగార్డుల(Guard) జీతాలను పెంచారని తెలిపారు. గతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసు శాఖకు సరైన వసతులు ఉండేవి కావని అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆధునిక టెక్నాలజీ, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని వివరించారు. మొట్టమొదటి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Police Command Control Centre)ను హైదరాబాద్ నిర్మించుకున్నామని వెల్లడించారు. న్యూయార్క్ పోలీసుల మాదిరిగా తెలంగాణ పోలీసులు సేవలందిస్తున్నారని తెలిపారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో పోలీసులను గుర్తించడం, గౌరవించుకోవడం అందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్, డీసీపీ సీతారాం తదితరులు పాల్గొన్నారు.