హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కేంద్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక యోజన నవంబర్ ప్రత్యేక సంచికను మంత్రుల నివాసంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మన రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిక మాస పత్రిక తెలంగాణ లాగా..కేంద్రంలో ప్రభుత్వ అధికారిక పత్రిక యోజన అభివృద్ధి సంక్షేమ పత్రికగా దేశంలో యోజన పత్రికకు మంచి పేరు ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ యోజన పత్రిక వెలువడుతున్నదని మంత్రి తెలిపారు.
ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా ఈ యోజన పత్రిక మంచి సమాచార వాహికగా పని చేస్తుందన్నారు. యోజన పత్రికలో ఈ నవంబర్ సంచికను మన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసమే కేటాయించారని తెలిపారు. తెలంగాణలోని ఆదర్శ గ్రామాలు, వాటి అభివృద్ధి పైనా ప్రత్యేక వ్యాసాలు రాశారన్నారు.
తెలంగాణ అభివృద్ధిపై సమగ్ర కథనాలు అందించిన యోజన మాస పత్రిక నిర్వాహకులు, సంపాదకవర్గం, ప్రత్యేకంగా వ్యాసాలు రాసిన అధికారులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో యోజన పత్రిక సీనియర్ ఎడిటర్ కృష్ణ వందన. పి, ఎడిటర్ సిరాజుద్దీన్ మహ్మద్, ఐ అండ్ పీఆర్ డిప్యూటీ డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.