పాలకుర్తి రూరల్, నవంబర్ 15: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేసిన సారథి సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో గొల్లకుర్మల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొలుత గొల్లకుర్మలు ఒగ్గు డోలు విన్యాసాలు, బోనాలు, శివసత్తుల పూనకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లికి మేకపిల్ల, గొంగడి బహూకరించారు. అనంతరం దయాకర్రావు మాట్లాడుతూ.. ఓటును ఆలోచించి వేయాలని, తొందరపడి వేయొద్దని సూచించారు.
ప్రజల కోసం పని చేసే నాయకులకు మాత్రమే ఎన్నుకోవాలని కోరారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో గొల్ల కుర్మలకు తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. గొల్ల కుర్మలకు అండగా నిలిచింది సీఎం కేసీఆరేనని కొనియాడారు. 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. తాను 70 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు , ఎన్నారై ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, గొల్ల కుర్మ సంఘం నాయకులు పండుగ నారాయణ, చిలువేరు పెంటయ్య, బొమ్మరబోయిన నాగరాజు, మాజీ కల్నల్, ప్రముఖ వైద్యుడు మాచర్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.