రాయపర్తి, ఆగస్టు 29 : చదువుతోనే సమాజంలోని సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి పసుల రమేశ్ పాండిచ్చేరిలోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్సీ మైక్రో బయాలజీలో ఉన్నత విద్యాభ్యాసం కోసం సీటు సాధించాడు. నిరుపేద వర్గానికి చెందిన రమేశ్కు అక్కడి వెళ్లి చదువుకొనే స్థోమత లేదు.
కాగా, రమేశ్ మంగళవారం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి పర్వతగిరి మండలకేంద్రంలోని మంత్రి నివాసానికి వెళ్లి తన పరిస్థితిని వివరించాడు. వెంటనే స్పందించిన ఎర్రబెల్లి రమేశ్ విద్యాభ్యాసం కోసం రూ.50వేల నగదును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరక్షరాస్యత కారణంగా సమాజంలో వేగవంతమైన వృద్ధిని సాధించలేక పోతున్నామన్నారు. అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి అక్కడి ప్రజలంతా సంపూర్ణ అక్షరాస్యతే కారణమన్నారు.