ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని కుదేలు చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సిగ్గులేకుండా రైతులపై మొసలి కన్నీరు కార్చుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
కరెంట్ కష్టాలు తీర్చి, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలతో ఎడారిగా మారిన తెలంగాణ రాష్ట్రానికి సాగు నీటి ప్రాజెక్ట్లను నిర్మించి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న రైతులను కార్లతో తొక్కించి ప్రాణాలు తీసిన బీజేపీ, మహారాష్ట్ర అక్రమ (బాబ్లీ) ప్రాజెక్ట్ నిర్మాణాలను అడ్డుకోలేని కాంగ్రెస్ పార్టీలు రైతుల కోసం మాట్లాడం సిగ్గుచేటని విమర్శించారు.
అకాల వడగండ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు రైతు బాంధవుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యవసాయం చేస్తున్న వ్యక్తులుగా, రైతుల బాధలు తెలిసిన మమ్మల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంపించడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అద్యక్షులు పల్లా రాజేశ్వర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించడం జరిగిందన్నారు.
వడగండ్ల వర్షాలకు పంటలు దెబ్బతిని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. రాజకీయ శూన్యత కలిగిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉనికి చాటుకునేందుకు బయటి వ్యక్తులను తీసుకొచ్చి, రైతులు కాని వారితో గలాట సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ సరఫరా లాంటి సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసిఆర్ కృషి చేస్తూ.. వారికి అండగా ఉంటారని, రైతులు అధైర్యపడకుండా భరోసాతో ఉండాలన్నారు. ఉనికి కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయాలు చేసి రైతులను ఆగం చేయవద్దని సూచించారు.