హైదరాబాద్ : బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని, బీజేపీ నేతలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. నిన్న హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ మహా సభల్లో తెలంగాణపై విషం కక్కిన ఆ పార్టీ తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలు పెట్టుకోవడానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు.
కానీ, సభల పేరుతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై చేసిన దాడి అంతా ఇంతా కాదన్నారు. ఈ దాడి మొత్తం తెలంగాణ ప్రజానీకంపై జరిగినదిగా భావిస్తున్నామన్నారు. పీఎం మోదీ కేసీఆర్ పేరు ఎత్తరు. కానీ, ఆయన భజన గణం అంతా కలిసి ప్రత్యక్షంగా సీఎం కేసీఆర్ పై దాడి చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు.
బీజేపీకి అధికార యావ తప్ప ప్రజలపై ప్రేమ లేదని మరోసారి తేలిందన్నారు. అబద్ధాలు వల్లించడం, మోసం చేయడం, మత విధ్వేషాలు రెచ్చగొట్టి దేశ భక్తి సెంటిమెంట్లను పండించి ఓట్లు దండుకునే రాజకీయాలు తెలంగాణలో సాగవని మంత్రి తెలిపారు. ఇక్కడి ప్రజలు బీజేపీ ఆటలు సాగనివ్వరన్నారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.