జనగామ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, వైఎస్సార్ నాయకురాలు షర్మీల అబద్ధాలు మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇద్దరి నాయకుల పాదయాత్ర సందర్భంగా తనపై చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. జనగామలో ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
తనపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని , నిరూపించలేక పోతే పదవులకు రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకోవాలని వారికి సవాల్ విసిరారు. ఏనాడు ఉద్యమాల్లో లేని, ప్రజల పక్షాన పోరాటాలు చేయని వ్యక్తులు పాదయాత్రలు చేస్తూ ప్రజాస్వామ్యం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ కోసం రేవంత్రెడ్డి ఏం చేశాడో తెలుపాలని డిమాండ్ చేశారు. ఆయన రాజకీయమంతా కుట్రలు, కుతంత్రాలతో నిండుకుని ఉందని, చంద్రబాబుకు ఏజెంట్గా వ్యవహరిస్తూ ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లాడని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ జైలుకు వెళ్లిన ఘనత తనదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు 15 సీట్లు రాగా ప్రస్తుతం రేవంత్ ఆధ్వర్యంలో 5 సీట్లు గెలవడం గగనమేనని అన్నారు.
రేవంత్ ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనమేనని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని షర్మీలకు మంత్రి సూచించారు. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడక పోతే తెలంగాణ ఎడారి అయ్యేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయంలోనే దేవాదుల ప్రాజెక్టు అన్యాయానికి గురైందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ వచ్చాకే దేవాదుల ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. రూ. వంద కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దని అన్నారు.